నిట్‌ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక

ఏపీ నిట్‌ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక
ఆహ్వానించిన డైరెక్టర్‌.. నేడో రేపో తేదీ ఖరారు
తాడేపల్లిగూడెం : ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏపీ నిట్‌) ప్రథమ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశరావు ఆయనను ఆహ్వానించారు. డిసెంబరు 20 నుంచి 22 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. నేడో రేపో తేదీ ఖరారు కానుంది. శాశ్వత క్యాంపస్‌లోనే స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు. గతంలో ఏపీ నిట్‌ శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో విచ్చేశారు. ఇప్పుడు తొలి స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి హోదాలో మరోసారి రానున్నారు. 379 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేస్తారు. స్నాతకోత్సవం నాటికి ప్రస్తుతం నిట్‌లో చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థులను శాశ్వత క్యాంపస్‌కు తరలించనున్నారు. ఆ మేరకు ప్రధాన క్యాంపస్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రథమ,ద్వితీయ సంవత్సర విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించారు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తు న్నారు. నిట్‌ ప్రగతిని వెంకయ్యనాయుడుకు డైరెక్టర్‌ వివరించారు.